రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు బలంగా కనిపించిన
వై.యస్. ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పరాజం తరువాత ఇంతవరకు కోలుకున్న దాఖలాలు
కనబడలేదు. నాయకులు, కార్యకర్తలు డీలాపడ్డారు. వైయస్ సానుభూతినే నమ్ముకొని బరిలో
దిగిన వారికి ప్రజలు ఆ అంశం కన్నా విడిపోయిన తరువాత రాష్ట్ర రాజధాని నిర్మాణం
మరియు అభివృద్ధి ముఖ్యమని తెలుగు దేశం పార్టీని భుజాలకెత్తుకున్నారు. గత సంవత్సరం తెలుగుదేశం పరిపాలనలో రాష్ట్ర ప్రజలు రాజధాని ఎంపిక , అభివృద్ధి తదితర
అంశాలనే పరిశీలిస్తున్నారు.
రాజధాని ఎంపికలోనూ, అభివృద్దిలోనూ పాలకపక్షానికి
సహకరించని ప్రతిపక్షం దీక్షల పేరుతో భూములు లాక్కుంటున్నారని పోరాడింది. ఈ పోరాటం
రాజధానికి వ్యతిరేకమని జనంలో అభిప్రాయం ఏర్పడింది. అలాగే పట్టిసీమ కు వ్యతిరేకంగా
పోరాడితే రాయలసీమకు నీరందిస్తుంటే వ్యతిరేకిస్తున్నారనే అభిప్రాయం పాలక పక్షం
జనంలోకీ విజయవంతంగా తీసుకు వెళ్ళగలిగింది. దీంతో వైయస్ఆర్ పార్టీ మరింత
నీరసించిపోతుంది. దీనిని ఇటీవల జగన్ కూడా గుర్తించినట్టే వున్నారు. దీనికంతటికీ
కారణం జగన్ ఒంటెద్దు పోకడ అనేది అందరూ భావిస్తున్నారు. ఏదైనా పోరాటమంటే రెండు
రోజులు దీక్షలు, యాత్రలు చేయడం కాదని ప్రజల భాగస్వామ్యం అవసరమని అందరూ
భావిస్తున్నారు. దీంతో జగన్ కూడా తాను కూడా ఏదైనా మారాలేమోననే ఆలోచనలో పడ్డట్టు
వున్నారు. మారాలని కార్యకర్తలూ కోరుకుంటున్నారు.