Sunday, 17 June 2012

ఈ గెలుపు వాపా ? బలుపా?



పలు రకాల అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు జగన్ జైలు పాలయినా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికలలో గెలుపొంది రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది. ఈ గెలుపు కొందరికి ఖేదం కాగా మరికొందరికి మోదం అవుతున్నది. ఈ ఉప ఎన్నికలు నీతికి, అవినీతికి అని, విస్వసనీయతకు, అవిస్వనీయతకు మధ్య పోరని పలు రకాలుగా ఎన్నికలకు ముందు వివిధ రకాల పార్టీలు ప్రచారం చేసుకున్నా ఓటరు దేవుడు వై.యస్.ఆర్ పార్టీకే ఓటు వేయడం జరిగింది. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, టి.ఆర్.యస్ లు ఈ ఫలితాలను జీర్ణించుకోలేపోతున్నాయి. ఈ ఫలితాలు కేవలం సానుభూతి పవనాల వల్ల వచ్చిందని, విజయమ్మ, షర్మిల కన్నీరు వల్ల వచ్చిందని సమాధానం చెప్పుకుంటున్నాయి . కాని వాటితో పాటు ఈ పాలక, ప్రతి పక్షాలు చేసిన పొరపాట్లే జగన్ పార్టీ జైత్రయాత్రకు సోపానాలయ్యాయి.  కాంగ్రెస్ పార్టీ  అంటున్నట్టు కర్ణుడి చావుకు కారణాల లాగా ఈ క్రింది కారణాలు అటు జగన్ కు తోడ్పడగా కాంగ్రెస్ కు తెలుగుదేశం ల పరాజయానికి కారణాలయ్యాయు
  • ఎఫ్.ఐ.ఆర్ లో వై.యస్. రాజశేఖర్ రెడ్డి పేరు వ్రాసినందులకు రాజీనామా చేసినప్పుడు, అందుకు నిరసన వ్యక్తం చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి తమ వాడేనని ఆయన తప్పు లేదని తొలుత కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఉప ఎన్నికలు మొదలు కాగానే వై.యస్. రాజశేఖర్ రెడ్డి కూడా ముద్దాయేనని తెరవెనుక లాలూచీలు జరిగాయని విమర్శించాయి.
  • ఎ.సి.బి .ద్వారా మధ్యం సిండికేట్ల పై ఎ.సి.బి దాడులు జరుగడం . అందులో బొత్స సత్యనారాయణ పై ఆరోపణలు రావడం. ఈ కేసులో మోపిదేవి వెంకటరమణ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన పై పలు ఆరోపణలు రావడం, బొత్స సత్యనారాయణ అధిష్టానంతో చర్చించిన మీదట ఆయనపై ఎలాంటి విచారణ జరుపకపోగా ఎ.సి.బి. అధికారి శ్రీనివాస్ ను అకస్మాత్తుగా ప్రమోషన్ పై బదిలీ చేయడం. కొద్దిరోజుల వ్యవధిలో అడిషనల్ డి.జి.పి అధికారి పై  ఇంకో అధికారిని నియమించి ఆయన అధికారాలకు కత్తెర వేయడం
  • ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి ల మధ్య సమైక్యత లేకపోవడంతో వాయలార్ రవి రావలసి రావడం.
  • సాక్షి మీడియా అకౌంట్లను సీజ్ చేయడం దానిపై పత్రికా స్వేచ్చని ప్రచారం జరిగి జగన్ ను అణగద్రొక్కడానికి కుట్ర చేస్తున్నట్టు జనం నమ్మడం
  • సి.బి.ఐ జగన్ ను ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభమయ్యాక అరెస్టు చేయడం , ముందుగానే అరెస్టు చేసి ఉంటే ఫలితాలు ఖచ్చితంగా వేరేగా ఉండేవి.
  • ఎన్నికల ముందురోజు కావాలనే దొంగల బండి ఎక్కించడం దానిపై సాక్షి టి.వి కధనాలు అంతకు ముందు అవినీతి పై అరెస్టు అయిన వ్యక్తి గురించి మీడియా ఎక్కువ ప్రచారం కల్పించడం.
  • టి.ఆర్.యస్ . బి.జె.పి పై దృష్టి పెట్టి వై.యస్.ఆర్ పార్టీని పెద్దగా పట్టించుకోకుండా ఆ పార్టీకి సానుకూలంగా వ్యవహరించి చివరి నిమిషంలో విమర్శలు చేయడం. అంతకు ముందే టి.ఆర్.యస్ , జగన్ పార్టీలు కుమ్ముక్కయ్యాయని ప్రచారం చేయడం.
  • తెలుగుదేశం అధినేత జనంలో విస్తృతంగా తిరిగినా జనం సమస్యలపై పోరాడకుండా కేవలం అవినీతి పైననే మాట్లాడటం, ద్వితీయ శ్రేణి నాయకత్వం ఉప ఎన్నికలలో పట్టుదలగా పనిచేయకపోవడం
  • వై.యస్.రాజశేఖర్ రెడ్డి పై జనంలో ఇంకా ఉన్న ఇమేజ్ ప్రధాన కారణంగా ఉంది. ఆయన చావును మళ్ళీ చర్చించి పదే పదే ఆ దృశ్యాలను చూపడం , సాక్షి టీ.వీ , పేపరులో కథనాలు  , ప్రభుత్వం పై , ప్రతిపక్షం పై అవినీతి కథనాలు ప్రచురింపడం వై.యస్.ఆర్ పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు అవినీతి, అక్రమాస్తులపై కేసు వేస్తే దానిపై సి.బి.ఐ స్పందించిన తీరు , అలాగే చంద్రబాబు స్టే తెచ్చుకోవడం దీనివల్ల ఎవరు అవినీతి చేయలేదనే అభిప్రాయం ప్రబలింది.
  • ప్రజారాజ్యం పార్టీ ఓట్లన్ని చిరంజీవి ఇమేజ్ తగ్గుముఖం పట్టడంతో అది జగన్ కు బదిలీ కావడం. ఎన్నికలు కొద్దిరోజులు ముందే చిరంజీవి కూతురు ఇంటిలో కోట్లాది రూపాయల నగదు ఐ.టి. అధికారులకు పట్టుబడటం. దానిపై వై.యస్.ఆర్ పార్టీ ప్రచారాన్ని జనం నమ్మడం.
  • ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సక్రమంగా లేకపోవడం. సరైన ఇమేజ్ ఉన్న నాయకత్వం లేకపోవడం, కరెంటు కోతలు, విద్యుత్ చార్జీలు పెంపు, పెట్రోలు ధరల పెంపు, వ్యాట్ పెంపు లతో పాటు వేసవిలో నీటి ఎద్దడి మరియు నిత్యావసరాల వస్తువుల ధరలు అమాంతగా పెరగడం
  • ప్రభుత్వంలో ని దాదాపు ఆరేడుమంది మంత్రులు కూడా అవినీతి అరోపణలు ఎదుర్కోంటున్నప్పుడు కేవలం ప్రభుత్వం జగన్ నే విమర్శించడం . కేవలం మోపిదేవినే అరెస్టు చేసింది జగన్ అరెస్టుకే నని జనం నమ్మడం
  • కోర్టు ఆదేశాల మేరకే జగన్ అరెస్టు జరిగిందని కాకుండా ఆ కేసుల విచారణ కేవలం కాంగ్రెస్ అధిష్టానం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చేసిందని ,. ఓదార్పు యాత్ర చేయడం వారికి ఇష్టం లేదని ప్రచారం జరుగడం.
  • వీటితో పాటు జగన్ అరెస్టయిన సందర్భంలో వారి తల్లి విజయమ్మ, షర్మిల ల ప్రచారం , వారు చేసిన ఆరోపణలు , వారి కన్నీటి పట్ల జనంలో సానుభూతి పెల్లు బికడం లాంటివి కూడా బాగా తోడ్పడ్డాయి.
జగన్ గెలుపు బలం కాదని కేవలం వాపని కొందరు అంటున్నారు. ఇది పాల పొంగని కేవలం ఈ ఎన్నికలకే పరిమితమని చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు చేసిన వివిధ పొరపాట్లు జగన్ నెత్తిన పాలు పోసినట్టే ఇలాగే కొనసాగితే 2014 లోనూ ఆ పార్టీలకు పరాభవం తప్పదు. 

No comments:

Post a Comment